Saturday, July 4, 2020

అరుణాక్షర అద్భుతానికి ఐదు దశాబ్దాలు N Venugopal

అరుణాక్షర అద్భుతానికి ఐదు దశాబ్దాలు N Venugopal

యాబై సంవత్సరాల కింద సరిగ్గా ఈ సమయాన తెలుగు సమాజంలో, సాహిత్యంలో ఒక చరిత్రాత్మక పరిణామం జరుగుతున్నది. విప్లవ రచయితల సంఘం ఆవిర్భవిస్తున్నది. ఆ అద్భుత సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, కొలిమి వెబ్ సాహిత్య మాసపత్రిక లో నేను ధారావాహికగా రాస్తున్న విరసం చరిత్ర మొట్టమొదటి వ్యాసాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇది 2019 జూన్ సంచికలో వెలువడింది. అలాగే విరసం ఆవిర్భావాన్ని ప్రకటించిన 1970 జూలై 5 నాటి ఆంధ్రప్రభ, విశాలాంధ్ర పేజీలు, ఆంధ్రప్రభలో ఆ రోజు వేసిన శ్రీశ్రీ ఫొటో కూడ ఇస్తున్నాను...

అరుణాక్షరావిష్కారానికి అర్ధశతాబ్ది

అది జూలై 4.

దేశం నుంచి వలస పాలకులను తరిమివేయడానికి అవసరమైన అరణ్యయుద్ధాన్ని నిర్వహించిన అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజు.

తెలంగాణను భూస్వామ్య బంధనాల నుంచి విముక్తి చేసే మహా యుద్ధంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య నేలకొరిగిన రోజు.

పాత వలస వాదుల మీద కొత్త వలస వాదుల పోరాటమే అయినప్పటికీ, ఇరుపక్షాలూ స్థానిక జాతులను ఊచకోత కోసినప్పటికీ, ప్రపంచానికంతా ప్రజాస్వామ్యపు ఆశలు పంచిన అమెరికా స్వాతంత్ర్యం సాధించిన రోజు.

అది 1970.

మహత్తర చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం, అనంత బలశాలి అమెరికాను ఢీకొంటూ విజయవాగ్దానం కురిపిస్తున్న వియత్నామ్ జాతీయ విముక్తి పోరాటం, అంతర్జాతీయంగా కోపోద్రిక్త అసంతృప్త విద్యార్థి యువజనుల తిరుగుబాట్లు, నక్సల్బరీ శ్రీకాకుళ విప్లవోద్యమాలు పెల్లుబుకుతున్న సందర్భం.

అది 1970 జూలై 4.

తెలుగు సమాజానికీ సాహిత్యానికీ సంబంధించినంతవరకు అది ఒక చరిత్రాత్మక సందర్భం.

ఇంగ్లిష్ నుడికారంలో చెప్పినట్టు రెడ్ లెటర్ డే. అరుణాక్షర దినం.

నిజంగానే అరుణాక్షర చరిత్రకు ఆవిష్కార దినం.

హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఇంపీరియల్ హోటల్ లో ఒక గదిలో ముందురోజు రాత్రి తొమ్మిది నుంచీ ఎడతెగకుండా జరిగిన చర్చోపచర్చల సమావేశం అనంతరం జూలై 4 ప్రవేశించాక ఉదయం ఒంటి గంటా పది నిమిషాలకు సమయం వేసి మరీ శ్రీశ్రీ సంతకం చేసిన ప్రకటనతో విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించింది.

అలా జూలై 4 ప్రజా పోరాటాలనుంచి ప్రేరణ పొంది ప్రజలకు విప్లవ సందేశం అందించేందుకు ఏర్పడిన తొట్టతొలి సాహిత్యకారుల సంస్థ పుట్టినరోజు.

‘ప్రజల నుంచి ప్రజలకు’ అనే మార్క్సిస్టు తత్వాన్ని అక్షరాల్లోకి అనువదించిన వందలాది మంది సాహిత్య కారులను సృష్టించిన, వేలాది మంది సాహిత్యకారులను ప్రభావితం చేసిన, లక్షలాది మంది ప్రజలకు చేరుకున్న ఏకైక సాహిత్య సంస్థ పుట్టిన రోజు.

నలబై తొమ్మిది సంవత్సరాలు నిండిన విప్లవ రచయితల సంఘం 2019 జూలై 4న యాభయ్యో సంవత్సరంలో, అర్ధశతాబ్ది ఉత్సవ సంరంభంలో అడుగు పెడుతున్నది.

విప్లవ సాహిత్య ప్రస్తావన లేకుండా, విప్లవ సాహిత్యానికి అగ్రగణ్య ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ అర్ధ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్ర రచనే అసాధ్యం.

కవిత్వం, పాట, కథ, నవల, నాటకం, సాహిత్య విమర్శ వ్యాసం, రాజకీయార్థిక సామాజిక సాంస్కృతిక విశ్లేషణా వ్యాసం, పత్రికా రచన, ఉపన్యాసం, అనువాదం... ఏ ప్రక్రియ తీసుకున్నా తెలుగు సాహిత్యానికి విప్లవ రచయితల సంఘం అందించిన కానుకలు అపారమైనవి, అత్యంత సంపన్నమైనవి. స్వయంగా సభ్యులే రచించిన కవితల, పాటల సంపుటాలు కనీసం రెండు వందలు, కథా సంపుటాలు వంద, నవలలు యాబై, వ్యాస సంపుటాలు రెండు వందలు, అనువాద రచనలు వంద, పుస్తక రూపంలోకి రాని, పత్ర్రికల్లో మిగిలిపోయిన రచనలు వేలాది, తెలుగు సీమ అంతా విస్తరించిన ఉపన్యాసాలు కొన్ని వేలు – ఏ ఒక్క ప్రక్రియ చరిత్ర రూపంలోనైనా విస్తారమైన విరసం చరిత్ర రాయవచ్చు.

నక్సల్బరీ శ్రీకాకుళ ఉద్యమాల నాటి నుంచి ఇవాళ్టిదాకా సాగిన, సాగుతున్న అనేక ప్రజా ఉద్యమాలు విప్లవ సాహిత్యానికి, విరసం రచయితల సాహిత్య సృజనకు ప్రేరణనిచ్చాయి. అవి తిరిగి విప్లవ సాహిత్యంతో ప్రేరణ పొందాయి. ఈ సమాజ సాహిత్య గతితార్కిక సంబంధాన్ని ఈ ఐదు దశాబ్దాల తెలుగు సమాజ చరిత్రతో కలిపి రాసినా మహోజ్వలమైన విరసం చరిత్ర రాయవచ్చు.

అటు ప్రభుత్వం నుంచీ రాజ్య శక్తుల నుంచీ ఇటు భిన్న సాహిత్య స్రవంతుల నుంచీ విమర్శలు, నిందలు, అబద్ధాలు, ఆరోపణలు, ఆంక్షలు, నిర్బంధాలు, పుస్తక నిషేధాలు, జైలు శిక్షలు, కుట్ర కేసులు, హత్యా ప్రయత్నాలు, హత్యలు ఇంతగా ఎదుర్కొన్న సాహిత్య సంస్థ ప్రపంచంలోనే మరొకటి ఉండదు. మొత్తంగా సంస్థనే 2005లో నిషేధానికి గురి అయి, న్యాయపోరాటం చేసి, నిషేధం నుంచి బైటపడింది. ఈ నిర్బంధాల చరిత్ర రూపంలోనైనా విరసం చరిత్ర రాయవచ్చు.

విప్లవ పూర్వ దశలో రష్యాలో మేధావుల, రచయితల కదలికలున్నాయి గాని ఒక సాహిత్యకారుల సంస్థ రూపొందలేదు. విప్లవ పూర్వ చైనాలో 1931లో వామపక్ష రచయితల సమాఖ్య ఏర్పడింది గాని నిర్బంధం వల్ల ఐదు సంవత్సరాల్లో మూతబడవలసి వచ్చింది. ఇతరదేశాల విప్లవ చరిత్రలలోనూ సాహిత్యకారుల సంఘటిత నిర్మాణ కృషి కనబడదు. ఇరవైకి పైగా ద్వైవార్షిక మహాసభలు, ఇరవైకి పైగా ద్వైవార్షిక సాహిత్య పాఠశాలలు, ఎన్నెన్నో కవిత్వ, కథా, వ్యాస శిక్షణా పాఠశాలలు, నిజనిర్ధారణ, సమాజ అధ్యయన పర్యటనలు, అన్ని జిల్లాలలోనూ, అన్ని ముఖ్య పట్టణాలలోనూ, గ్రామాలలోనూ సామాజిక, సాహిత్య అంశాలపై సభలు, సమావేశాలు, ఇంత విస్తృతమైన నిర్మాణ చరిత్ర గల సాహిత్య సంస్థ ప్రపంచంలోనే మరొకటి ఉండదు. ఈ నిర్మాణ చరిత్రగానైనా విరసం చరిత్ర రాయవచ్చు.

“ఈ మహోజ్వల వీర శ్రీకాకుళము పేర
లిఖియించు చరితకు నిర్మాత ఎవరన్న
నేటి విప్లవ కవుల కావ్యాలు వినిపించి
సత్యమును పూర్తిగా తెలుసుకోనివ్వాలి” అని యాబై సంవత్సరాల కిందనే అన్న కవి వాక్కును నిజం చేసింది విప్లవ రచయితల సంఘం.

ఈ యాబై సంవత్సరాల విప్లవ సాహిత్య చరిత్ర, విప్లవ రచయితల సంఘం చరిత్ర ఆసక్తిదాయకమైనది, అద్భుతమైనది, ఉద్వేగభరితమైనది, రోమాంచకమైనది, ఆదర్శపూరితమైనది, ఉత్తేజకరమైనది.

ఐదుపదుల ‘చిరుగాలి సితార’ - విరసం

ఐదుపదుల ‘చిరుగాలి  సితార’
July 3, 2020 Andhrajyothi

ఇప్పుడు కమ్ముకుంటున్న కారుమబ్బులో ఏదో కొత్త సందేశం దాగి ఉన్నది. బహుశా, మనుషులు మనిషితనాన్ని నిలుపుకోవడానికి ఒక యుద్ధం చేయవలసి రావచ్చు. చిన్న సానుకూలత, చిన్న ప్రగతిశీలత, కాసింత ఉదారత– ఈ లక్షణాలు ఉంటే చాలు, ఇప్పుడు జరిగే పోరాటంలో ఆ మనిషి ఒక ఆవశ్యకమైన శక్తి. అటువంటి అందరినీ కలుపుకోవడానికి, అందరితో కలసి నడవడానికి అవసరమైన సందర్భం వచ్చింది. సరికొత్త 1930 లను ఎదురీదడానికి ప్రజాశ్రేణులకు విరసం సహనాయకత్వం అవసరం.

ఇప్పుడు కూడా ఏదో రుతు మేఘం ఆకాశాన్ని కమ్మేస్తున్నది.

ఎక్కడ చూసినా జనం, జనం. నిన్న ఇరానీ నగరం కెర్మన్‌లో జనం, మొన్న చిలీలో జనం, ఆ ముందు ముంబైలో జనం. ఇండియాలో యూనివర్సిటీల ముందు జనం. రోడ్డ మీద జనం. జెండాలు పట్టుకుని, నినాదాలు ఎత్తుకుని జనం. ప్రపంచంలోని ఆక్రోశం అంతా ఏదో కూడబలుక్కుంటున్నది. కాలం మళ్లీ పునరావృత్తమవుతున్నదా? వియత్నాం ఇప్పుడు పశ్చిమాసియాలో ఉన్నది కదా?

1930లు ముసురుకుంటున్నాయా? వేరుచేయడానికి, బంధించడానికి, విషవాయువుతో చంపడానికి, హీనం చేసి ధ్వంసం చేసి మనిషిని హననం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అటో ఇటో నీ పేరు చిట్టాలోకి ఎక్కిస్తున్నారా? ఆనవాళ్ల కోసం సమాధులు తవ్వుతున్నారా? ఏ ఉనికీ లేనివాళ్లకోసం సమాధులు నిర్మిస్తున్నారా?

ఏదో ఒక రుతు మేఘం ఆకాశాన్ని ఆవరిస్తున్నది. ఇది మనలను అమృతధారలో తడిపేస్తుందా? జలప్రళయంతో తుడిచిపెడుతుందా?

***

ఇప్పటి లాగే అప్పుడు కూడా జనం జనం. కేంపస్‌లను ఆక్రమించిన విద్యార్థులు. 1960ల చివరి సంవత్సరాలు. రెక్క విప్పిన రివల్యూషన్‌. కేంద్రాన్ని బద్దలు కొట్టమన్న సాంస్కృతిక మహావిప్లవం. సరిహద్దులను తెంపేసిన, దిక్కులను ఊపేసిన, భాషను వివస్త్రం చేసిన వాగ్గేయ యువకులు, దిగంబర కవులు. గొంతు సవరించుకుంటున్న కాలం.



సరిగ్గా యాభై ఏళ్ల కిందట తెలుగు ఆకాశం రుతుగీతికి పులకించి, పొంగిపోయింది. లొంగిపోయిన అక్షరాన్ని నిలదీసి, ప్రలోభించిన అక్షరాన్ని ప్రశ్నించి, రచయితలారా మీరెటువైపు అని కొత్తతరం ప్రశ్నించింది. మహాకవిని గోడకుర్చీ వేయించి, విప్లవం ఇంపోజిషన్‌ ఇప్పించింది. విప్లవం ఏడున్నదో ఆడనే నీ గూడున్నదని ఒప్పించింది. స్వార్థం శిరస్సును గండ్రగొడ్డలితో నరకగలిగిన వాడే నేటి హీరో అని ప్రకటించింది. సంస్కరణ వాదానికి కాలం చెల్లిపోయింది అనీ, అభ్యుదయ ఉద్యమం శవప్రాయమైపోయిందని, జాతిని సమగ్ర విమోచనం వైపు నడిపేందుకే విప్లవరచయితల సంఘం ఏర్పడుతున్నదని 1970 జులై 4 నాడు వ్యవస్థాపక సభ్యులు ప్రకటించారు.



సమాజాన్ని, వ్యవస్థను మౌలికంగా మార్చాలనే లక్ష్యాన్ని, అన్ని రకాలుగా మనుషులందరూ సమానత్వంతో జీవించే వ్యవస్థ కావాలనే ఆదర్శాన్నీ ప్రకటించుకున్న రాజకీయాలు, ఆచరణలో నెమ్మదించాయని, రాజీపడుతున్నాయని అనంతర తరం రాజకీయ విమర్శ చేసింది, అవే ఆదర్శాలను పంచుకునే రచయితలు, కవులు తమ సాహిత్యాచరణలో విఫలమయ్యారని సాహిత్యవిమర్శ చేసింది. ఈ రెండిటి నేపథ్యంలో కొత్త ఉత్సాహంతో– దృఢసంకల్పాన్ని, నిజాయితీని, వ్యవస్థపై రాజీలేని ఆగ్రహాన్ని ప్రకటించడానికీ, సాహిత్యరంగంలో విప్లవ పతాకం ఎగురవేయడానికీ విప్లవ రచయితల సంఘం(విరసం)ఆవిర్భవించింది. అనేక కష్టాలు, నష్టాలు, నిర్బంధాలు, విమర్శలు, దిద్దుబాట్ల నడుమ ఐదు దశాబ్దాల కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసింది విరసం. ఆ సంస్థ తీసుకున్న తీవ్ర వైఖరులను, అనుసరించిన కఠినమైన ఆచరణను గమనిస్తే, ఇంత సుదీర్ఘకాలం అటువంటి సంస్థ మనగలగడమే ఒక విజయం. ఇప్పటికీ, రాజ్యంతో రాజీలేని వైఖరిని అనుసరించగలుగుతున్న సంస్థగా కొనసాగుతూ ఉండడం మరింత విశేషం.



అభ్యుదయోద్యమ కాలం నుంచి, ప్రగతిశీల రచయితలుగా ఉన్న శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, రమణారెడ్డి, చలసాని ప్రసాద్‌ వంటి వారికి తోడు, కొత్తగా జతచేరిన నలుగురు దిగంబరులు, వరంగల్‌ వంటి సాహిత్య కేంద్రాల నుంచి వచ్చిన మార్చ్‌ వంటి బృందాల కవులు– విరసాన్ని తొలి అడుగు నుంచి పరుగుతీయించారు. కవిత్వంలో తీవ్రత, ప్రేరణాత్మకత, భావుకతకు ఆస్కారం లేని ఆవేశం, ఉద్వేగం– విప్లవ కవిత్వంపై వెంటనే విమర్శలను కూడా రప్పించాయి. నినాదప్రాయమైన కవిత్వం అన్నారు. రాజకీయం పాలు ఎక్కువ, సాహిత్యం పాలు తక్కువ అన్నారు. శ్రీకాకుళం ఉద్యమంలో మరణించిన సుబ్బారావు పాణిగ్రాహి, రచయిత నిబద్ధత, నిమగ్నత ఎంత ఉండాలనే చర్చకు కేంద్రం అయ్యారు. విప్లవోద్యమంలో ఉంటూ గెరిల్లా కవిత్వం రాసిన శివసాగర్‌ సజీవ కొలమానం అయ్యారు. రాజకీయపార్టీకి, సాహిత్యానికి ఎంత దూరం, ఎంత దగ్గర తనం ఉండాలి అనే చర్చలు కూడా ఆ కాలంలో జరిగాయి. రాజకీయపార్టీ ఎన్ని మెలికలు తిరిగితే, సాహిత్యం కూడా అన్ని మలుపులు తిరగనవసరం లేదని సీనియర్‌ విప్లవ రచయితలే వ్యాఖ్యానించారు. విప్లవోద్యమంలో ఉన్న వివిధ రాజకీయ సంస్థలు, వాటిపై అభిమానం కలిగిన రచయితలు బయటి ప్రపంచానికి గ్రూపులుగా, ముఠాలుగా కనిపించారు. అటువంటి విభేదాల ఆధారంగానే విరసంలో చీలికలు కూడా ఏర్పడ్డాయి. ఎమర్జెన్సీలో అనేక మంది విప్లవరచయితలు జైలు పాలయ్యారు. ఎమర్జెన్సీ కాలంలో వ్యవహరించిన తీరు కారణంగా శ్రీశ్రీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.



ఎమర్జెన్సీ అనంతరకాలంలో విప్లవద్యోమంలో మార్పు వచ్చింది. మునుపటి పంథా మారి, ప్రజారంగంలో విస్తృతంగా పనిచేయాలనే ధోరణి ఏర్పడింది. అందుకు అనుగుణంగానే విరసం స్వరంలో కూడా మార్పు వచ్చింది. దశాబ్ది కాలం గడిచేసరికి, విరసం కవులలో కూడా నినాదాలు, ఆవేశాల ధోరణి బాగా తగ్గిపోయింది. విప్లవకవిత్వంలో కవిత్వం, విప్లవసాహిత్యంలో సాహిత్యం గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ, విరసం ఉనికిలోకి వచ్చిన మొదటి దశాబ్దం రక్తం చేత రాగాలాపన చేయించింది. ఆ దశాబ్ద కాలాన్ని దందహ్యమాన దశాబ్దం అన్నారు.



కవిత్వ ఉధృతి ఎక్కువ ఉన్నప్పటికీ, విరసం ఆరంభ దశాబ్దంలోనే రావిశాస్త్రి, కాళీపట్నం, భూషణం వంటి కథానవలా రచయితలతో సంపన్నంగా ఉండింది. ఆ తరువాత కాలంలో అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, సాహు వంటి గొప్ప కథకులు తెలంగాణ జీవితాన్ని, పోరాట జీవితాన్ని కథనం చేశారు. అజ్ఞాత జీవితంలోని విప్లవకారులు కూడా అనేకులు తమ ఉద్యమ జీవితాన్ని కథలుగా రాశారు. మంచి కథకులుగా మారారు.



సాహిత్యానికి రాజకీయాలకు ఉండే సంబంధం గురించిన చర్చ విరసంలో కూడా సాగుతూనే వచ్చింది. గతితార్కిక సాహిత్య భౌతికవాదం, సాహిత్యానికి ఉండే స్వయం ప్రతిపత్తి మొదలైన అంశాలు విస్తృతంగా చర్చల్లోకి వచ్చాయి. 1980ల ప్రారంభం నుంచి స్త్రీవాదం, ఆ తరువాత దళితవాదం, మైనారిటీ వాదం, ప్రాంతీయవాదం సాహిత్యంలో ప్రవేశించాయి. 1980 దశకం ఆరంభం నుంచి విప్లవ కవిత్వం/ సాహిత్యం తెలుగు సాహిత్యంలో ప్రధాన స్రవంతిగా పరిగణనలో లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే, ప్రధాన స్రవంతి అన్న భావనే అంతరించి పోయింది. అనేక బాటలు, కోవలు ఏకకాలంలో ఉనికిలో ఉంటూ వచ్చాయి. ఆయా వాదాలు వచ్చిన కొత్తలో, వాటి గొంతుబలంగా వినిపించినప్పటికీ, తరువాత అవి కొత్తవాటికి చోటు ఇస్తూ వచ్చాయి. తెలుగు సాహిత్యంపై ఏకైక నిర్ణాయక శక్తిగా విప్లవ సాహిత్యోద్యమం ఇక లేదన్నది వాస్తవం. ఒక బాహుళ్యంలో తాను భాగస్వామిగా మాత్రమే ఉండడాన్ని విరసం వెంటనే జీర్ణం చేసుకోలేకపోయినప్పటికీ, అతి త్వరలోనే వాస్తవికతను అంగీకరించింది. విరసంలో ఇప్పుడు 1970ల నాటి జోష్‌ లేకపోవచ్చును కానీ, అప్పటి కంటె ఎక్కువ ప్రజాస్వామికత ఉన్నదనిపిస్తుంది.



ప్రతి ‘ఇతర‘ ధోరణినీ శత్రుపూరితంగా చూడడం, నైతికమయిన తీర్పులు ఇవ్వడం – విరసం గత ధోరణి. ఇప్పుడది మారుతోంది. కొత్త తరం వచ్చింది. అధ్యయన శీలత ఉన్న, ఇతరులతో కలసి నడుద్దామన్న తపన ఉన్న యువత నాయకత్వం – ఈ సానుకూల మార్పులకు కారణమనిపిస్తుంది. వివిధ అస్తిత్వాల భాగస్వామ్యం పెరగడం కూడా ఇందుకు నిస్సందేహమైన కారణం. సాహిత్యానికి సంబంధించిన లోతైన అంశాలను, కొత్త కొత్త భావనలను, రచనా రీతులను చర్చించడం కానీ, తమ సభ్యులకు పరిచయం చేయడం కానీ విరసం వంటి సాహిత్య సంస్థకు ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. అన్యవర్గ సాహిత్యమని గతంలో భావించేవాటిపై ఇప్పుడు సహనపూరితమైన విశ్లేషణలు, పరిశీలనలు విరసం ద్వారా జరుగుతున్నాయి. ఆ మార్పు, రచయితలను సంఘటితం చేసే ఐక్యతావ్యూహంలో మాత్రమే భాగం కాదనీ, నిజంగానే ఆ వైఖరిని ఒక విలువగా అంగీకరిస్తున్నారని ఇంకా నిర్ధారణ కావలసి ఉన్నది. ఏ అస్తిత్వ వాదాన్నీ ఆయా అస్తిత్వాలకు చెందినవారిలాగా సొంతం చేసుకోనక్కరలేదు కానీ, ఒక ఇంద్రధనస్సు దృక్పథం వ్యవహారసరళిలో ఉండాలి.



ఇతరులకు లేని సాహసం ఉంది. సంకల్పం ఉంది. కష్టాలను ఎదుర్కొనగలిగే నిబద్ధత ఉన్నది. యాభైఏళ్ల ఘనచరిత్ర ఉన్నది. జడత్వాన్నీ, పిడివాదాన్నీ సహజంగానే ఎడంగా పెట్టగలిగే కొత్త తరం నాయకత్వం ఉన్నది. ఇంకేమి కావాలి, విరసం మరింత విస్తృతం కావడానికి, మరింత ప్రభావశీలం కావడానికి.


సముద్రగర్భంలో ఉన్న అజ్ఞాత కెరటాలనే కాదు, జనసముద్రంలో నురగలు నురగలుగా తరగలెత్తుతున్న అలలను కూడా చూడండి. ఆ అలలను కూడా ప్రేమించగలిగే, చిరుగాలి సితారా సంగీతంగా మోగండి. అలలు కనే కలలను నిజం చేయండి.

ఇప్పుడు కమ్ముకుంటున్న కారుమబ్బులో ఏదో కొత్త సందేశం దాగి ఉన్నది. బహుశా, మనుషులు మనిషితనాన్ని నిలుపుకోవడానికి ఒక యుద్ధం చేయవలసి రావచ్చు. చిన్న సానుకూలత, చిన్న ప్రగతిశీలత, కాసింత ఉదారత– ఈ లక్షణాలు ఉంటే చాలు, ఇప్పుడు జరిగే పోరాటంలో ఆ మనిషి ఒక ఆవశ్యకమైన శక్తి. అటువంటి అందరినీ కలుపుకోవడానికి, అందరితో కలసి నడవడానికి అవసరమైన సందర్భం వచ్చింది. సరికొత్త 1930లను ఎదురీదడానికి ప్రజాశ్రేణులకు విరసం సహనాయకత్వం అవసరం.

కె. శ్రీనివాస్